ఆంధ్ర ఎలక్షన్స్ పై హాట్ కామెంట్స్ చేసిన పరుచూరి గోపాలకృష్ణ

ఏపీ లో ఇటీవల జరిగిన ఎన్నికలు చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే. ఘనవిజయం సాధించిన కూటమి అభ్యర్థులకు, పవన్‌కళ్యాణ్‌కు సినీ పరిశ్రమ శుభాకాంక్షలు తెలియజేసింది. ఇప్పటికే సోషల్‌ మీడియాలో టాలీవుడ్‌లోని ప్రముఖులు తమ అభినందనలు తెలియజేశారు. ఇక పవన్‌కల్యాణ్‌ కూడా తన విజయానందాన్ని కుటుంబ సభ్యులతో పంచుకున్నారు. అన్నయ్య మెగాస్టార్‌ చిరంజీవికి పాదాభిందనం చేసి ఆయన ఆశీస్సులు అందుకున్నారు. అలాగే తల్లికి, వదినకు కూడా పాదాభివందనం చేశారు. తాజాగా పరుచూరి గోపాలకృష్ణ విజేతలను ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు వైరల్‌ అవుతున్నాయి. ‘నేను చంద్రబాబు ప్రభుత్వంలో పనిచేశాను. ఆయనతో నాకు మంచి అనుబంధం ఉంది. పోరాటం చేయడానికి వయసు అడ్డు కాదని ఆయన నిరూపించారు. ఎన్నికల ముందు ఆయన్ని అరెస్ట్‌ చేయడం ఎంతో బాధించింది. గెలుపే లక్ష్యంగా ఎంతో జోరుగా ప్రచారం చేశారు. మంచి విజయాన్ని సాధించారు. నేను పవన్‌ కల్యాణ్‌ సినిమాకు పని చేయలేదు. ఆయన్ని నేను ఒక్కసారే కలిశాను. ఎన్నికల్లో భావోద్వేగంతో, విశ్వాసంతో ముందుకు వెళ్ళారు. ఆయన కళ్ళలో ‘నేను సాధిస్తున్నా’ అనే విశ్వాసం కనిపించింది. గెలిచిన తర్వాత కూడా ఆయన ఎంతో వినయంగా మాట్లాడారు. బాలకృష్ణగారు గెలుస్తారని ముందే ఊహించాను. నా చెల్లెలులాంటి పురంధేశ్వరి గెలవాలని కోరుకున్నాను. ఆమె రాజమహేంద్రవరం ఎంపీగా ఎన్నిక కావడం సంతోషంగా ఉంది’ అన్నారు.