గన్నవరం నుండి విమాన సర్వీసులు పెంచండి : కేశినేని చిన్ని

గన్నవరం విమానాశ్రయం నుంచి దేశంలోని వివిధ ప్రాంతాలకు విమాన సర్వీసులను ప్రారంభించాలని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ (చిన్ని) కేంద్ర మంత్రిని కోరారు. కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి కింజారపు రామ్మోహన నాయుడితో సోమవారం భేటీ అయిన కేశినేని చిన్ని.. ఈ సందర్భంగా ఇండిగో సంస్థ సర్వే చేసిన మార్గాల్లో గన్నవరం నుంచి విమాన సర్వీసులు తక్షణం ప్రారంభించాలని కోరారు.గన్నవరం విమానాశ్రయం నుంచి వారణాసి వ‌యా వైజాగ్, విజయవాడ నుండి  కలకత్తా వ‌యా విశాఖపట్నం, విజయవాడ నుండి బెంగళూరు వ‌యా హైదరాబాద్ లేదా  కొచ్చి, విజయవాడ నుండి అహ్మదాబాద్, విజయవాడ నుండి పుణే విమాన స‌ర్వీసుల ప్రారంభించాల‌ని అభ్య‌ర్థించారు. ఆయా మార్గాలలో విమాన సర్వీసులపై ఇప్పటికే ఇండిగో సంస్థ సర్వే చేసిన సంగతి తెలిసిందే.ఈ మేరకు కేశినేని చిన్ని కేంద్రమంత్రి కింజారపు రామ్మోహన్ నాయుడికి వినతి పత్రం సమర్పించారు. అలాగే కేంద్ర పౌర విమానయాన మంత్రిగా బాధ్యతలు చేపట్టిన రామ్మోహననాయుడికి లిఖితపూర్వక అభినందనలు తెలిపారు. కాగా కేశినేని చిన్ని అభ్యర్థనకు కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించారు.