చివరి నిముషం లో ఇరుక్కున్న సీఎస్ జవహర్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్  సిఎస్ జవహర్ రెడ్డి సీనియర్ ఐఏఎస్ అధికారి. దాదాపు అన్ని ప్రభుత్వాల్లో ఆయన పనిచేశారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి అనుకూలంగా ఉండేవారు. అటు రాజకీయాలకు అతీతంగా నడుచుకునేవారు. కానీ వైసిపి అధికారంలోకి వచ్చిన తరువాత వన్ సైడ్ అయ్యారు. జగన్ సర్కార్ కు అనుకూలంగా వ్యవహరించారు. రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఎన్నో వివాదాస్పద నిర్ణయాల్లో భాగస్వామ్యం అయ్యారు. ఇప్పుడు పదవీ విరమణ ముందు అవే వివాదం అవుతున్నాయి. మున్ముందు ఆ కేసులు వెంటాడే అవకాశాలు కనిపిస్తున్నాయి.మరో నెల రోజుల్లో సి ఎస్ జవహర్ రెడ్డి పదవీ విరమణ చేయనున్నారు. కానీ ఇప్పుడు ఆయనపై ఎన్నో రకాల ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా విశాఖ, విజయనగరం జిల్లాల్లో అసైన్డ్ భూముల కొనుగోలు వెనుక తన కుమారుడి పాత్ర ఉందని ఆరోపణలు వస్తున్నాయి. అప్పట్లో సి ఎస్ జీవో జారీ వెనుక ఉన్న తతంగం కొంతమంది అధికారులకు తెలుసు. కానీ వారంతా సిఎస్ కు అస్మదీయలే. అయితే ఎక్కడో తేడా కొట్టింది. వారు ఇప్పుడు విపక్షాలకు సమాచారం ఇచ్చారు. పూర్తి ఆధారాలను అందించారు. అప్పటినుంచి సి ఎస్ జవహర్ రెడ్డి చుట్టూ వివాదం అలుముకుంది. నేరుగా సిఎస్ పైనే విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో పదవీ విరమణ ముందు జవహర్ రెడ్డి ఆత్మరక్షణలో పడ్డారు. కానీ తాను ఇన్నాళ్లు నమ్ముకున్న వైసిపి నేతల నుంచి కూడా ఆశించిన సహకారం ఆయనకు అందడం లేదు.సిఎస్ జవహర్ రెడ్డి తన కుమారుడికి మంచి వ్యాపార జీవితం ఇవ్వాలని భావించారు. సగటు తండ్రిగా అది తప్పులేదు. ముందుగా ఆయనను మైనింగ్ వ్యాపారం లోకి దించారు. తరువాత ఇప్పుడు భూముల కొనుగోలు వ్యవహారం అప్పగించారు. అయితే సీఎస్ గా బాధ్యత తీసుకున్న నాటి నుంచే జగన్ సర్కార్కు వీర విధేయుడుగా మారిపోయారు అన్న ఆరోపణ ఆయనపై ఉంది. పైగా వైసీపీ అంటేనే వ్యాపారాలకు అనుకూలం అన్న పేరు ఉంది. దీంతో అడ్డగోలు జీవోలతో వైసీపీ నేతలకు సహకరించారన్న ఆరోపణ కూడా ఆయనపై ఉంది. ఈ తరుణంలో తన కుమారుడి కోసం ప్రభుత్వపరంగా సిఎస్ జవహర్ రెడ్డి సహకరించారన్న ఆరోపణలు ఉన్నాయి. మరో నెలలో పదవీ విరమణ పొందుతుండగా ఈ తరహా ఆరోపణలు రావడం ఆందోళన కలిగిస్తోంది. గతంలో చాలామంది అధికారులకు ఎదురైన పరిణామాలే.. జవహర్ రెడ్డి ఎదుర్కోక తప్పదు. ఒకవేళ జగన్ తిరిగి అధికారంలోకి వస్తే పర్వాలేదు. లేకుంటే మాత్రం జవహర్ రెడ్డి రిటైర్ అయిన తర్వాత కూడా కేసులను ఎదుర్కోవాల్సి ఉంటుంది. అందుకే ఆయన ఎక్కువగా ఆందోళనతో ఉన్నట్లు సమాచారం