నందమూరి ఫ్యామిలీకి పదవుల వరాలు

ఏపీ నుంచి రాజ్యసభకు వెళ్లేదెవరు. వైసీపీ నుంచి ముగ్గురు రాజ్యసభ సభ్యులు ఇప్పటికే రాజీనామా చేసారు. వారి ఖాళీల భర్తీకి ఏపీలో కూటమి పార్టీలు కసరత్తు చేస్తున్నాయి. ముగ్గురు సభ్యుల ఎంపిక పైన చంద్రబాబు ప్రతిపాదనలు సిద్ధమయ్యాయి. పవన్, బీజేపీతో నాయకత్వం తో చర్చించినట్లు తెలుస్తోంది. అందులో భాగంగా రెండు టీడీపీ, ఒకటి జనసేనకు ఇవ్వాలని భావించినా.. మూడు పార్టీలకు ఒక్కో సీటు ఖరారు దిశగా నిర్ణయం జరిగినట్లు సమాచారం. ఇక, అభ్యర్ధుల ఖరారు దాదాపు కొలిక్కి వచ్చింది.వైసీపీ రాజ్యసభ సభ్యులు మోపిదేవి, మస్తాన రావు, క్రిష్ణయ్య రాజీనామా చేసారు. వీరిలో మస్తాన రావు, మోపిదేవి టీడీపీలో చేరారు. మస్తాన రావుకు తిరిగి రాజ్యసభ ఇస్తామనే హామీ ఉంది. ముగ్గురూ బీసీ వర్గాలకు చెందిన వారు కావటంతో ఇప్పుడు కొత్తగా రాజ్యసభకు పంపేవారి విషయంలో కూటమి నేతలు ఆచి తూచి ఎంపిక చేస్తున్నారు. ప్రస్తుతం అసెంబ్లీలో కూటమికి పూర్తి బలం ఉండటంతో మూడు స్థానాలు వీరికే దక్కనున్నాయి. అందులో భాగంగా జనసేన నుంచి మెగా బ్రదర్ నాగబాబు పేరు దాదాపు ఖరారైంది. చివరి నిమిషంలో అనూహ్య మార్పులు జరిగితే మినహా నాగబాబు తన అన్నయ్య చిరంజీవి తరహాలో పెద్దల సభకు వెళ్లటం ఖాయంగా కనిపిస్తోంది.టీడీపీ నుంచి పలువురు రాజ్యసభ రేసులో ఉన్నారు. అందులో భాగంగా నందమూరి సహాసిని పేరు పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. తెలంగాణలో పార్టీ భవిష్యత్ ప్రయోజనాలు.. నందమూరి కుటుంబానికి ప్రాధాన్యత దిశగా ఈ ప్రతిపాదన పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇదే సమయంలో పార్టీ నుంచి గల్లా జయదేవ్, కంభంపాటి రామ్మోహన్ రావు, కేంద్ర మాజీ మంత్రి అశోక్ గజపతి రాజు, మాజీ మంత్రి యనమల రామకృష్ణుడు, దేవినేని ఉమా మహేశ్వరరావు పేర్లు వినిపిస్తున్నాయి. అయితే, టీడీపీ నుంచి ఈ సారి బీసీకి అవకాశం ఇస్తారని.. కొత్త వారికి కాకుంటే తిరిగి మస్తాన రావునే టీడీపీ నుంచి ఎంపిక చేస్తారని పార్టీ ముఖ్యులు చెబుతున్నారు.