విశాఖ లో గంజాయి స్మగ్లింగ్ సరి కొత్త దందా

విశాఖపట్నంలో మరో సరికొత్త దందా బయటపడింది. కొన్ని ముఠాలు పోలీసుల కళ్లుగప్పి గంజాయిని ఇతర రాష్ట్రాలకు తరలించేందుకు కొత్త మార్గాలను వెతుక్కుంటున్నారు. తాజాగా నగరంలో డ్రైఫ్రూట్స్ మాటున సాగుతున్న గంజాయి అక్రమ రవాణాకు బ్రేకులు వేశారు. ప్రముఖ కొరియర్‌ సంస్థ ద్వారా గంజాయి రవాణా చేస్తున్న ముఠా గుట్టును విశాఖపట్నం రైల్వే పోలీసులు బయటపెట్టారు. విశాఖ నుంచి ఢిల్లీకి 16 కిలోల గంజాయిని రవాణా చేస్తుండగా వికాశ్‌‌కుమార్‌ అనే వ్యక్తి రైల్వే పోలీసులు పట్టుకున్నారు. అతడ్ని ప్రశ్నించగా కీలక విషయాలు తెలిశాయి.వికాశ్ కుమార్ కుమార్ అతి తెలివితో గంజాయిని ఎవరికీ అనుమానం రాకుండా ప్యాక్‌ చేసి, ఆన్‌లైన్‌లో హోం సర్వీస్‌ పికప్‌ బుక్‌ చేస్తున్నాడు. కొరియర్‌ సంస్థలు ఒకవేళ ప్యాకింగ్‌లో ఏముందని అడిగితే.. డ్రైఫ్రూట్స్‌ అని చెబుతుండటంతో నిజమేనని నమ్మి వారు బుక్‌ చేస్తున్నారు. కొద్దిరోజులుగా గుట్టుగా ఈ వ్యవహారం నడుస్తోంది. విశాఖపట్నం నుంచి పలు ప్రాంతాలకు గంజాయి రవాణా చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ గంజాయి అక్రమ రవాణా వెనుక ముఠా ఉన్నట్లు తెలుసుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు. వికాశ్ కుమార్‌ను పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు.