హాస్పటల్ నుండి డిశ్చార్జ్ అవుతున్న కెసిఆర్

మాజీ సీఎం, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆరోగ్యం క్రమంగా కుదుటబడుతోంది. ప్రమాదవశాత్తు జారిపడి తుంటి ఎముకకు తీవ్ర గాయమవ్వటంతో.. సోమాజిగూడలోని యశోద ఆసుపత్రిలో హిప్ బోన్ రిప్లేస్‌మెంట్ సర్జరీ జరిగిన విషయం తెలిసిందే.. కాగా.. ఆయన గాయం నుంచి వేగంగా కోలుకుంటుండటంతో.. రేపు డిశ్చార్జి చేయనున్నట్లు వైద్యులు వెల్లడించారు. డిశ్చార్జ్‌ అనంతరం కేసీఆర్‌‌ను బంజారాహిల్స్‌ నందినగర్‌లోని నివాసానికి కుటుంబ సభ్యులు తీసుకెళ్లనున్నట్టు తెలుస్తోంది. అయితే.. కేసీఆర్‌కు ఏ కొంచెం సమయం దొరికినా ఎర్రవెల్లిలోని తన ఫౌమ్ హౌస్‌లోనే గడిపేందుకు.. ఇష్టపడుతుంటారు. అయితే.. అదే ఫౌమ్ హౌస్‌లో జారిపడటంతో ఆయన కాలికి తీవ్రగాయమైంది. అయితే.. ఆయనకు అయిన గాయం నుంచి పూర్తిగా కోలుకోవాలంటే సుమారు 6 నుంచి 8 వారాలు పడుతుందని వైద్యులు చెప్పిన నేపథ్యంలో.. నందినగర్‌ నివాసానికి తీసుకెళ్లి ఆయనను జాగ్రత్తగా చూసుకోవాలని కుటుంబసభ్యులు భావిస్తున్నారు.అయితే.. కేసీఆర్‌ తన గాయం నుంచి కోలుకుంటుండగా.. పూర్తిగా రెస్ట్ తీసుకోవటానికి పరిమితం కాకుండా.. సమయం దొరికినప్పుడల్లా పుస్తకాలు చదువుతూ మెదడుకు పని చెప్తూనే ఉన్నారు. సాధారణంగానే.. చదవటం అంటే కేసీఆర్‌కు మక్కువ కావటంతో.. ఇప్పడు ఆస్పత్రిలో ఖాళీగా ఉండటం ఇష్టం లేక.. ప్రముఖ పుస్తకాలు తెప్పించుకుని చదువుతున్నారు. చాలా మంది పరామర్శించేందుకు వస్తుండగా.. వారిని కలిసిన తర్వాత మిగతా సమయం పుస్తకాలు చదువుతూ సమయాన్ని సద్వినియోగం చేసుకుంటున్నారు.