కెసిఆర్ ఆరోగ్యం పై హెల్త్ బులిటన్ రిలీజ్ చేసిన యశోద హాస్పిటల్

బీఆర్‌ఎస్‌ అధినేత మాజీ సీఎం కేసీఆర్ మొన్న బాత్ రూమ్ లో కాలుజారి పడిపోయి తుంటి ఎముకకి గాయం అయినా సంగతి విదితమే ,అయితే ఆయన  ఆరోగ్యంపై వైద్యులు రెండో రోజున హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. తుంటి ఎముక శస్త్ర చికిత్స శుక్రవారం విజయవంతంగా జరగ్గా.. ప్రస్తుతం ఆ గాయం నుంచి కేసీఆర్ మెల్లిగా కోలుకుంటున్నారు. 24 గంటలు వైద్యుల పర్యవేక్షణలోనే కేసీఆర్ ఉండగా.. ఈరోజు వైద్యులు ఆయనను నడిపించినట్లు హెల్త్‌ బులిటెన్‌లో పేర్కొన్నారు. కాగా.. ప్రస్తుతం కేసీఆర్‌ ఆరోగ్యం నిలకడగా ఉందని.. ఆయన వేగంగా కోలుకుంటున్నారని వైద్యులు తెలిపారు. అంతర్జాతీయ వైద్య ప్రమాణాల ప్రకారం సర్జరీ చేసిన 12 గంటల్లోగా నడిపించాల్సి ఉంటుందని డాక్టర్లు తెలిపారు. వైద్యం అందిస్తున్న ఆర్థోపెడిక్‌ నిపుణుల సమక్షంలోనే కేసీఆర్‌ను నడిపించినట్లు పేర్కొన్నారు. ఆయన ఆరోగ్య పరిస్థితిపై సంతృప్తిగా ఉన్నట్లు యశోద ఆసుపత్రి వైద్యుల బృందం హెల్త్‌ బులిటెన్‌లో వివరించింది.ఎన్నికల ఫలితాలు విడుదలైనప్పటి నుంచి కేసీఆర్.. ఎర్రవెల్లిలో ఉన్న తన ఫామ్ హౌస్‌లోనే ఉంటున్న విషయం తెలిసిందే. అయితే.. నిన్న తెల్లవారు జామున 3 గంటల ప్రాంతంలో ప్రమాదవశాత్తు కేసీఆర్ బాత్రూంలో కాలు జారి పడ్డారు. ఈ ఘటనలో ఆయన ఎడమ కాలి తుంటి ఎముకకు తీవ్ర గాయమైంది. అన్ని పరీక్షలు చేసిన వైద్యులు.. తుంటి ఎముక మార్పిడి సర్జరీ చేయాలని నిర్ణయించారు. నిపుణులైన వైద్యుల సమక్షంలో కేసీఆర్‌కు తుంటి ఎముక మార్పిడి సర్జరీ విజయవంతంగా పూర్తి చేశారు. కాగా.. ఈరోజు మధ్యాహ్నం.. నిపుణులైన వైద్యుల సమక్షంలో కేసీఆర్‌ను నడిపించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వాకర్ సాయంతో కేసీఆర్ మెల్లిమెల్లిగా అడుగులు వేస్తున్నారు.