తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం

తెలంగాణ డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఇంట తీవ్ర విషాదం నెలకొంది. ఆయన సోదరుడు మల్లు వెంకటేశ్వర్లు కన్నుమూశారు. అనారోగ్యంతో బాధపడుతున్న వెంకటేశ్వర్లు.. హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాసవిడిచారు. హోమియో ఎండీ చదివిన మల్లు వెంకటేశ్వర్లు.. ఆయుష్ శాఖలో ప్రొఫెసర్‌గా, అడిషనల్ డైరెక్టర్‌గా పనిచేసి రిైటర్డ్ అయ్యారు. అనంతరం వైరాలోని 1వ వార్డులో ఉన్న తన నివాసంలో హోమియో వైద్యశాలను నిర్వహిస్తున్నారు. మల్లు వెంకటేశ్వర్లకు హోమియో వైద్యంలో ఎంతో మంచి పేరు ఉంది. అతని వద్ద వైద్యం చేయించుకునేందుకు రాష్ట్రంలోని పలు ప్రాంతాల నుంచి రోగులు వస్తుంటారు. డబ్బు కోసం కాకుండా సామాజిక బాధ్యతతో ఈ ఆసుపత్రిని ఆయన నిర్వహించారు.అయితే గత మూడు నెలలుగా ఆయన కాలేయ సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు. ఆరోగ్యం క్షీణించటంతో ఇటీవల హైదరాబాద్ గచ్చిబౌలిలోని ఏఐజీ ఆసుపత్రిలో ఆయన్ను జాయిన్ చేశారు. అక్కడ చికిత్స పొందుతున్న ఆయనకు గత మూడు రోజుల క్రితం గుండెపోటు వచ్చింది. దీంతో ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించి ఇవాళ ఉదయం కన్నుమూశారు. తన స్వగ్రామమైన స్నానాల లక్ష్మీపురంలో ఈ సాయంత్రం 5 గంటలకు అంత్యక్రియలు నిర్వహించనున్నారు. మల్లు వెంకటేశ్వర్లు మరణవార్తతో స్నానాల లక్ష్మీపురం గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. కాగా, భట్టి మరో సోదరుడు మల్లు రవి కాంగ్రెస్ పార్టీలోనే కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఆయన ఢిల్లీలోని ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధిగా వ్యవహరిస్తున్నారు.