హమ్మో పుష్పా -2 మీద అన్ని కోట్లా ..?

 

 

అల్లు అర్జున్ పాన్ ఇండియా స్టార్ అయిపోయాక ...సినిమా అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి  ఇప్పుడు పుష్ప' రెండో భాగంగా రూపొందుతోన్న 'పుష్ప: ది రూల్'పై భారీ అంచనాలు ఉన్నాయి. ఐకాన్ స్టార్ అల్లు అర్జున్, స్టార్ డైరెక్టర్ సుకుమార్ కాంబినేషన్ లో రూపొందిన 'పుష్ప: ది రైజ్' పాన్ ఇండియా రేంజ్ లో సర్ప్రైజ్ హిట్ సాధించింది. 2021 డిసెంబర్ లో విడుదలైన ఈ మూవీ వరల్డ్ వైడ్ గా రూ.350 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తున్న ఈ సినిమా రెండో భాగం అత్యంత భారీ స్థాయిలో తెరకెక్కుతోంది. 'పుష్ప-2' వరల్డ్ వైడ్ గా కనీసం రూ.1000 కోట్ల గ్రాస్ రాబడుతుందనే అంచనాలు ఉన్నాయి. అందుకు తగ్గట్టుగానే మేకర్స్ థియేట్రికల్ రైట్స్ కోసం భారీగా కోట్ చేస్తున్నారు.

'పుష్ప 2'పై ముందు నుంచి భారీ అంచనాలు ఉన్నాయి. ఫస్ట్ లుక్, గ్లింప్స్ విడుదలయ్యాక అంచనాలు రెట్టింపు అయ్యాయి. మరోవైపు షూట్ జరుగుతున్న కొద్దీ అవుట్ పుట్ చూసుకొని, మేకర్స్ కి కాన్ఫిడెన్స్ పెరుగుతున్నట్లుంది. ఓవర్సీస్ రైట్స్ కోసమే ఏకంగా రూ.97 కోట్లు కోట్ చేస్తున్నారట. రాజమౌళి డైరెక్షన్ లో రూపొందిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ల మల్టీస్టారర్ 'ఆర్ఆర్ఆర్' రూ.70 కోట్ల దాకా ఓవర్సీస్ బిజినెస్ చేయగా.. ఇప్పుడు 'పుష్ప 2' నిర్మాతలు తమ చిత్రానికి ఏకంగా రూ.97 కోట్లు కోట్ చేయడం ఆసక్తికరంగా మారింది. ప్రస్తుతం 'పుష్ప 2' మీద నెలకొన్న క్రేజ్ దృష్ట్యా ఆ మొత్తానికి ఓవర్సీస్ రైట్స్ అమ్ముడుపోయినా ఆశ్చర్యంలేదు అంటున్నారు. మరి విడుదలకు ముందే ఇంతటి సంచలనాలు సృష్టిస్తున్న 'పుష్ప 2', విడుదల తర్వాత ఇంకెలాంటి సంచలనాలు సృష్టిస్తుందో చూడాలి.

రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తున్న ఈ యాక్షన్ డ్రామాలో ఫహాద్ ఫాజిల్, సునీల్, అనసూయ, జగదీష్ తదితరులు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం 2024 ఆగస్టు 15న ప్రేక్షకుల ముందుకు రానుంది.