వైసీపీ తీర్ధం పుచ్చుకున్న టీడీపీ నేత

ఆంధ్రప్రదేశ్‌‌‌లో సార్వత్రిక ఎన్నికలు వైఎస్సార్‌సీపీని కోలుకోలేని దెబ్బతీశాయి. ఆ పార్టీ కేవలం 11 సీట్లకు మాత్రమే పరిమితం అయ్యింది.. ఫలితాల తర్వాత వరుసగా నేతలు పార్టీని వీడుతున్నారు. మాజీ మంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు ఇప్పటికే వైఎస్సార్‌సీపీకి గుడ్ బై చెప్పేశారు.. జిల్లాల్లో కూడా అదే పరిస్థితి కనిపిస్తోంది. అయితే మొన్నటి వరకు వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీ, జనసేన, బీజేపీల్లో చేరిన నేతల్ని చూశాం.. కానీ ఈయన మాత్రం కాస్త వెరైటీ. అధికారంలో ఉన్న టీడీపీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరి షాకిచ్చారు.కాకినాడ జిల్లా ప్రత్తిపాడు నియోజకవర్గానికి చెందిన ముదునూరి మురళీకృష్ణంరాజు టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా ఉన్నారు. ఆయన పార్టీకి గుడ్ బై చెప్పి వైఎస్సార్‌సీపీలో చేరారు.. ఆయనకు కండువా కప్పిన అధినేత జగన్ పార్టీలోకి ఆహ్వానించారు. ప్రత్తిపాడు నియోజకవర్గంలో వైఎస్సార్‌సీపీ బలోపేతం కోసం పనిచేస్తానని చెప్పారు ముదునూరి మురళీకృష్ణంరాజు. మురళీకృష్ణంరాజు అధికార పార్టీని వీడి వైఎస్సార్‌సీపీలో చేరడం ఆసక్తికరంగా మారింది. ప్రత్తిపాడు నియోజకవర్గంలో రాజకీయ సమీకరణాలతో ఆయన టీడీపీని వీడినట్లు తెలుస్తోంది.ముదునూరి మురళీకృష్ణంరాజు 2023 ఏప్రిల్‌లో వైఎస్సార్‌సీపీని వీడి టీడీపీలో చేరారు. ఆయన్ను టీడీపీ రాష్ట్ర కార్యదర్శిగా, అమలాపురం నియోజకవర్గ టీడీపీ పరిశీలకుడిగా నియమిచంచారు. మురళీకృష్ణంరాజు ఆయన చేరినప్పటి నుంచి ప్రత్తిపాడులో విభేదాలు మొదలయ్యాయి. ఆయనపై టీడీపీ నేతలు ఘాటు వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో మురళీరాజు టీడీపీకి ద్రోహం చేశారని.. ప్రత్తిపాడు అభ్యర్థి వరుపుల సత్యప్రభ కోసం పనిచేయకుండా వైఎస్సార్‌సీపీ ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థుల కోసం డబ్బులు పంచారని సంచలన వ్యాఖ్యలు చేశారు.